ఆ దాడి మా పనే: పాకిస్థాన్ తాలిబన్
ABN, First Publish Date - 2021-04-22T23:09:34+05:30
పాకిస్థాన్లోని ఓ లగ్జరీ హోటల్ వద్ద నేడు జరిగిన బాంబు పేలుడు తమ పనేనని పాకిస్థాన్ తాలిబన్ ప్రకటించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఓ లగ్జరీ హోటల్ వద్ద నేడు జరిగిన బాంబు పేలుడు తమ పనేనని పాకిస్థాన్ తాలిబన్ ప్రకటించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఉన్న విలాసవంతమైన సెరేనా హోటల్లో పాకిస్థాన్కు చైనా రాయబారి బస చేశారు. ఈ హోటల్ కార్ పార్కింగ్ ప్రాంతంలో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను చైనా తీవ్రంగా ఖండించింది. మరోవైపు, ఈ పేలుడు తమ పనేనని, తమ లక్ష్యం భద్రతాధికారులని పాకిస్థాన్ తాలిబన్ తాజాగా ప్రకటించింది. ఆత్మాహుతి బాంబర్ ముందుగా నిర్దేశించుకున్నట్టుగానే నేరుగా భద్రతాధికారులను ఢీకొట్టాడని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అధికార ప్రతినిధి తెలిపాడు. కాగా, చనిపోయిన వారిలో భద్రతాధికారులు, హోటల్ సిబ్బంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో ఆ హోటల్లో తమ రాయబారి లేరని చైనా విదేశీ మంత్రిత్వశాక అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు.
Updated Date - 2021-04-22T23:09:34+05:30 IST