ఇటీవలి టీఎంసీ దాడుల్లో 30 మందికిపైగా బీజేపీ కార్యకర్తలు మృతి!
ABN, First Publish Date - 2021-06-16T12:10:44+05:30
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి...
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని, దాడులకు దిగుతున్నారని బీజేపీ పశ్చిమ బెంగాల్శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. గడచిన ఒకటిన్నర నెలల్లో ౩౦ మందికి పైగా బీజేపీ కార్యకర్తలు మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఘోష్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి ప్రయోజనం అందలేదన్నారు. గడచిన ఒకటిన్నర నెలల్లో తమ పార్టీ కార్యకర్తల్లో 30 మంది వరకూ మరణించారని, అయినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయమై ఎప్పుడూ చర్చించలేదని, హింసాత్మక దాడుల గురించి పాలకులు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఉత్తర బెంగాల్ ప్రజలకు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం కావాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులపై మమతా బెనర్జీ చేసిన విమర్శల గురించి ఘోష్ మాట్లాడుతూ ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టిని మళ్లించడానికి మమత తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
Updated Date - 2021-06-16T12:10:44+05:30 IST