మళ్లీ తెరపైకి నారదా కేసు.. నలుగురికి సమన్లు
ABN, First Publish Date - 2021-09-02T01:42:53+05:30
మంత్రులు ముఖర్జీ, హకీం సహా ఎమ్మెల్యే మిత్రాలు.. బెంగాల్ అసెంబ్లీలో సభ్యులు కావడం వల్ల వారికి అసెంబ్లీ స్పీకర్ ద్వారా సమన్లు జారీ చేసినట్లు, ఇక మిగిలిన ఇద్దరికి నేరుగా వారి ఇంటి అడ్రస్కు సమన్లు పంపినట్లు కోర్టు పేర్కొంది
కోల్కతా: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ఫరిద్ హకీం, సుబ్రతా ముఖర్జీ సహా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ను బుధవారం ప్రత్యేక కోర్టుకు ఈడీ అందించింది. కాగా, చార్జిషీట్లో ఈడీ పేర్కొన్న నేతలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. సదరు వ్యక్తులు నవంబర్ 16లోగా కోర్టు ముందు హాజరు కావాలని సమన్లలో కోర్టు పేర్కొంది. అయితే ఈడీ నమోదు చేసిన వ్యక్తులతో పాటు సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఎస్ఎమ్హెచ్ మీర్జాపై కూడా కోర్టు దర్యాప్తు చేపట్టింది.
మంత్రులు ముఖర్జీ, హకీం సహా ఎమ్మెల్యే మిత్రాలు.. బెంగాల్ అసెంబ్లీలో సభ్యులు కావడం వల్ల వారికి అసెంబ్లీ స్పీకర్ ద్వారా సమన్లు జారీ చేసినట్లు, ఇక మిగిలిన ఇద్దరికి నేరుగా వారి ఇంటి అడ్రస్కు సమన్లు పంపినట్లు కోర్టు పేర్కొంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర కలకలం సృష్టించిన ఈ కేసులో, ఈ యేడాది మొదట్లో హకీం, ముఖర్జీ, మిత్రాలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం.. కొద్ది రోజులకు వారికి బెయిల్ లభించింది. కాగా, దీనిని రాజకీయ కక్షసాధింపుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా టీఎంసీ నేతలు వాదిస్తున్నారు.
Updated Date - 2021-09-02T01:42:53+05:30 IST