క్షమాపణ చెప్పేవరకూ మంత్రికి క్లాసు పీకిన సీఎం... కారణమిదే!
ABN, First Publish Date - 2021-03-06T12:23:00+05:30
బీహార్ ప్రభుత్వానికి చెందిన మంత్రి ముఖేష్ సహనీ వ్యవహారం...
పట్నా: బీహార్ ప్రభుత్వానికి చెందిన మంత్రి ముఖేష్ సహనీ వ్యవహారం అక్కడి శాసనసభ ఉభయ సభలను వేడెక్కించింది. చివరికి ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోక్యం చేసుకుని ముఖేష్ సహనీని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే మంత్రి ముఖేష్ ఇటీవల వైశాలి జిల్లాలోని హాజీపూర్లో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాల్సివచ్చింది. అయితే ముఖేష్ తన బదులు తన సోదరుడు సంతోష్ కుమార్ను సదరు కార్యక్రమానికి పంపించారు.
దీంతో సంతోష్ కుమార్ అక్కడ మంత్రిగా అధికారం చెలాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో బీహార్ శాసనసభలోని ఉభయ సభల్లో దీనిపై వాడిగా చర్చ జరిగింది. విపక్షాలు ముఖేష్ తీరుపై మండిపడ్డాయి. తక్షణమే మంత్రి సోదరుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సభలో ఉన్న సీఎం మాట్లాడుతూ తనకు ఇప్పటి వరకూ ఈ విషయం తెలియదని, ఈ విషయంపై స్వయంగా దర్యాప్తు చేస్తానని అన్నారు. దీని తరువాత సీఎం నితీష్... మంత్రి ముఖేష్ను దీని గురించి ప్రశ్నించి, విషయం తెలుసుకుని, క్లాసు పీకారు. చివరికి మంత్రి ముఖేష్ ఆ ప్రభుత్వ కార్యక్రమానికి తన తమ్ముడిని పంపడంపై మీడియా ముందు క్షమాపణలు కోరారు.
Updated Date - 2021-03-06T12:23:00+05:30 IST