భారత్లోకి 100 మంది చైనా సైనికుల చొరబాటు!
ABN, First Publish Date - 2021-09-29T07:11:41+05:30
చైనా సైనికులు ఉత్తరాఖండ్లోకి గత నెల చొరబడిన ఘటన ఆలస్యంగా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: చైనా సైనికులు ఉత్తరాఖండ్లోకి గత నెల చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 30న సుమారు 100మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ఉత్తరాఖండ్లోని బారాహొతీలోకి గుర్రాలపై వచ్చి, సుమారు 3 గంటలపాటు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అక్కడి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని చైనా సైనికులు నాశనం చేశారని, అయితే.. భారత బలగాలతో ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోలేదని తెలిపాయి. బలగాలు అక్కడికి చేరుకునేసరికే పీఎల్ఏ సైనికులు ఉడాయించారని పేర్కొన్నాయి.
అయితే.. చైనా సైనికుల చొరబాటు వార్తలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. అసలు ఇలాంటి సమాచారమేదీ తమ దృష్టికి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కంటైనర్ తరహా నివాసాలను తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా సైనికల కోసం నిర్మించినట్లు ఒక పత్రిక కథనాన్ని ప్రచురించింది.
Updated Date - 2021-09-29T07:11:41+05:30 IST