ఈసారి కపుర్తలలో.. గురుద్వారాలో వ్యక్తిని కొట్టి చంపిన భక్తులు!
ABN, First Publish Date - 2021-12-19T21:32:19+05:30
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గర్భగుడిలోకి ప్రవేశించి అపవిత్రం చేసిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన జరిగి
కపుర్తలా: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గర్భగుడిలోకి ప్రవేశించి అపవిత్రం చేసిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే అదే రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలో మరో దారుణం జరిగింది. గురుద్వారాలోని జెండాను తొలగించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని భక్తులు కొట్టి చంపారు.
జిల్లాలోని నిజామ్పూర్లో ఈ ఉదయం జరిగిన ఘటన స్థానికంగా సంచలనమైంది. గురుద్వారాలోని నిషాన్ సాహిబ్ (సిక్కుల జెండా)ను దుండగుడు తొలగించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో ఊగిపోయిన భక్తులు అతడిని పట్టుకుని దాడిచేశారు. వారి దెబ్బలకు తాళలేని అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయంలో పోలీసులు కానీ, మరే ఏజెన్సీ కానీ జోక్యం చేసుకోవద్దని గురుద్వారా ఓ ప్రకటనలో కోరింది. ఇలాంటి కేసులకు పంజాబ్ పోలీసులు, ప్రభుత్వానిది సమాన బాధ్యత వహిస్తాయని పేర్కొంది. అంతేకాదు, ప్రజలు నేడు పెద్ద సంఖ్యలో గురుద్వారా వద్దకు తరలిరావాలని పిలుపునిచ్చింది. కాగా, ఇలాంటి ఘటన జరగడం గత 24 గంటల్లో ఇది రెండోసారి. శనివారం సాయంత్రం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించిన ఆగంతకుడు గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన భక్తులు అతడిని పట్టుకుని కొట్టి చంపారు.
Updated Date - 2021-12-19T21:32:19+05:30 IST