సీబీఐ ఆఫీసు ముందు సీఎం మమత నిరసన
ABN, First Publish Date - 2021-05-17T18:50:05+05:30
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నారద కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్ హకీం... మమతా బెనర్జీ కేబినెట్లో రవాణాశాఖ మంత్రి. ఫిర్హద్తోపాటు ఈ కేసులో నేతలు మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీ, సోవన్ చటర్జీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో అప్పటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.
Updated Date - 2021-05-17T18:50:05+05:30 IST