పోలీసు వేషంలో ఖలిస్థానీలు : నిఘా హెచ్చరిక
ABN, First Publish Date - 2021-08-13T22:21:20+05:30
ఖలిస్థాన్ అనుకూలురు ఢిల్లీ పోలీసులమంటూ ఎర్ర కోట భద్రతా
న్యూఢిల్లీ : ఖలిస్థాన్ అనుకూలురు ఢిల్లీ పోలీసులమంటూ ఎర్ర కోట భద్రతా వలయంలోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సంఘ వ్యతిరేక శక్తులు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా దేశ రాజధాని నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఢిల్లీలోని మత సంబంధమైన ప్రదేశాల్లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నాలు జరగవచ్చునని హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. తాజా హెచ్చరికలను కూడా సమీక్షించారు.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని నగరంలోని అన్ని సంస్థలను పోలీసులు హెచ్చరించారు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ఢిల్లీలో ప్రశాంతతకు విఘాతం కలిగించే అవకాశం ఉందని తెలిపారు.
Updated Date - 2021-08-13T22:21:20+05:30 IST