దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-01-25T13:31:00+05:30
దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి....
మరణాల రేటు అత్యల్పం
తిరువనంతపురం (కేరళ): దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల నమోదు జాతీయ సగటు 1.9 శాతం కాగా, కేరళలో కరోనా వేగంగా సంక్రమిస్తూ 12.48 శాతానికి పెరిగింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ కరోనా పరీక్షలను లక్షకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సిఫారసు చేసింది. అయితే కేరళ రాష్ట్రంలో రోజువారీగా 40వేల నుంచి 60 వేలమందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ సుల్ఫీ నుహు చెప్పారు.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని కేరళ సర్కారు అంగీకరించింది.
అయితే కేరళలో 15 శాతం వెంటిలేటర్లు, 49 శాతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో మాత్రమే రోగులున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తాము కరోనా టెస్టు పాజిటివ్ రేటు కంటే ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ రేటు, ఐసీయూ అడ్మిషన్, వెంటిలేటర్ ఆక్యుపెన్సీలను పరిశీలిస్తామని కొవిడ్ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ మొహమ్మద్ అషీల్ చెప్పారు. అయితే కరోనా రోగుల మరణాల శాతం అత్యల్పంగానే ఉందని కేరళ సర్కారు చెబుతోంది. కేరళ రాష్ట్రంలో ఆదివారం 6,036 కరోనా కేసులు వెలుగుచూశాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు.
Updated Date - 2021-01-25T13:31:00+05:30 IST