జస్టిస్ ఖురేషీపై వివాదమెందుకు?
ABN, First Publish Date - 2021-09-18T07:54:09+05:30
తాజా బదిలీల్లో అత్యంత కీలకమైనది ప్రస్తుత త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టి్సగా ఉన్న జస్టిస్ అకిల్ ఖురేషీని రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ...
న్యూ ఢిల్లీ, సెప్టెంబరు 17: తాజా బదిలీల్లో అత్యంత కీలకమైనది ప్రస్తుత త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టి్సగా ఉన్న జస్టిస్ అకిల్ ఖురేషీని రాజస్థాన్ హైకోర్టుకు బదిలీచేయడం. నిజానికి దేశంలోని హైకోర్టుల సీనియర్ న్యాయమూర్తుల్లో ఈయన రెండోవారు. 2004లో గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 14 ఏళ్లు అక్కడే పనిచేశారు. 2018 నవంబరులో ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ పదవి ఖాళీ అయింది. సీనియర్ అయిన జస్టిస్ ఖురేషీ యాక్టింగ్ సీజేగా బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. ఆకస్మికంగా బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ ఆయన సీనియారిటీ లిస్టులో ఐదో స్థానంలో నిలిచారు. ఆయన బదిలీని నిరసిస్తూ గుజరాత్ హైకోర్టుకు చెందిన 1,200 మంది న్యాయవాదులు సమ్మెకు దిగారు. సుప్రీంకోర్టుకెక్కారు. దీంతో ఆయన్ను పెద్ద హైకోర్టు (మధ్యప్రదేశ్)కు బదిలీచేయాలని 2019లో కొలీజియం సిఫారసు చేయగా.. కేంద్రం ఫైలును తిప్పిపంపింది. దీంతో కొలీజియం తన సిఫారసును ఉపసంహరించుకుని త్రిపుర చీఫ్ జస్టి్సగా పంపింది. ఇక్కడ నలుగురు న్యాయమూర్తులే ఉంటారు. ఆ తర్వాత కొలీజియం ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు తర్జనభర్జన పడింది. సుప్రీంకోర్టుకు ఎవరి పేర్లు సిఫారసు చేసినా.. ముందు జస్టిస్ ఖురేషీ పేరే ఉండాలని నాటి కొలీజియం సభ్యుడైన జస్టిస్ ఆర్ నారీమన్ గట్టిగా పట్టుబట్టారు. ఆయన గత నెల 12న రిటైరయ్యారు. వారం తర్వాత జస్టిస్ ఖురేషీ పేరు లేకుండానే 9 మందిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. ఇప్పుడు జస్టిస్ ఖురేషీని పెద్ద కోర్టయిన రాజస్థాన్ హైకోర్టుకు బదిలీచేయాలని సూచించింది. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జస్టిస్ ఖురేషీ ఇచ్చిన తీర్పులే ఆయన పదోన్నతికి అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో.. 2010లో సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఆయన్ను సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు దిగువ కోర్టు నిరాకరించగా.. ఆ తీర్పును జస్టిస్ ఖురేషీ కొట్టివేసి.. షాను రెండ్రోజులు సీబీఐ కస్టడీకి పంపారు.
Updated Date - 2021-09-18T07:54:09+05:30 IST