మళ్లీ రాష్ట్రంగా జమ్మూకశ్మీర్?
ABN, First Publish Date - 2021-06-14T07:31:55+05:30
జమ్మూకశ్మీర్ మళ్లీ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించనుందా..? ఆ దిశగా కేంద్రం యోచిస్తోందా? ఈ మేరకు ఇక్కడి పార్టీలను సంప్రదించనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి...
- కేంద్రం యోచన, కశ్మీర్ పార్టీలతో భేటీ?
- ఎన్నికల నిర్వహణపైనా చర్చించే అవకాశం
శ్రీనగర్, జూన్ 13: జమ్మూకశ్మీర్ మళ్లీ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించనుందా..? ఆ దిశగా కేంద్రం యోచిస్తోందా? ఈ మేరకు ఇక్కడి పార్టీలను సంప్రదించనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి కేంద్ర రాజకీయ వర్గాలు. పార్టీలతో చర్చల అనంతరం.. ఇక్కడ ఎన్నికల నిర్వహణపైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా తొలగింపును వ్యతిరేకిస్తూ ఇక్కడి ఏడు పార్టీలు కలిసి గుప్కార్ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్రంతో చర్చలకు ఈ కూటమి కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. చర్చలకు తాము వ్యతిరేకం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. కాగా.. 2018 జూన్లో మెహబూబా ముఫ్తీతో బీజేపీ దోస్తీ చెడిపోవడంతో జమ్మూకశ్మీర్లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఇక 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగ హోదాను తొలగించి, రాష్ట్రాన్ని కేంద్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ)గా మార్చింది. ఆ తర్వాత భద్రత కారణాల రీత్యా రెండు యూటీల్లోనూ ప్రధాన ఎన్నికలు నిర్వహించలేదు.
Updated Date - 2021-06-14T07:31:55+05:30 IST