బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నాం.. భారత్, చైనా సంయుక్త ప్రకటన
ABN, First Publish Date - 2021-08-03T01:49:46+05:30
వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని భారత్, చైనా తాజాగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని భారత్, చైనా తాజాగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. లద్దాఖ్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరు దేశాల మధ్య శనివారం 12వ విడత సైనిక కమాండర్ల చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాలు సోమవారం ఓ సంయుక్త ప్రకటన చేశాయి. శనివారం జరిగిన సమావేశంలో ఇరు దేశాలు.. హాట్స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల్లో సైన్యాల ఉపసంహరణపై ప్రధానంగా చర్చించాయి. ఈ విషయాలపై లోతుగా చర్చించామని ఇరు దేశాలూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి బలగాల ఉపసంహరణను మరింత వేగవంతం చేసేందుకు భారత్, చైనా అంగీకరించాయి.
పాంగాంగ్ సరస్సు వద్ద సైన్యాల ఉపసంహరణ తరువాత.. భారత్-చైనా చర్చల్లో ఇప్పటివరకూ చెప్పుకోదగిన పురోగతి ఏదీ కనిపించలేదు. దెప్సాంగ్, దెమ్చోక్ను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని భారత్ పట్టుబడుతుండగా చైనా అందుకు ససేమిరా అంటోంది. ఈ కారణంగానే చర్చల్లో పురోగతి లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - 2021-08-03T01:49:46+05:30 IST