అమిత్షాపై క్రిమినల్ కేసు వేస్తా: మాజీ సీఎం నారాయణస్వామి
ABN, First Publish Date - 2021-03-01T21:46:47+05:30
కేంద్ర హోం మంత్రి అమిత్షాపై క్రిమినల్ పరువునష్టం కేసు వేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత..
కరైకాల్: కేంద్ర హోం మంత్రి అమిత్షాపై క్రిమినల్ పరువునష్టం కేసు వేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి హెచ్చరించారు. పుదుచ్చేరిలోని కరైకాల్లో అమిత్షా తనపై చేసిన ఆరోపణలను సోమవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాజీ సీఎం తిప్పికొట్టారు. తనపై చేసిన ఆరోపణలను అమిత్షా నిరూపించాలని సవాలు చేశారు.
ప్రధానమంత్రి మోదీ పుదుచ్చేరికి రూ.15,000 కోట్లు పంపారని, ముఖ్యమంత్రి నారాయణ స్వామి దానిలో కోత పెట్టి కొంత మొత్తం గాంధీ కుటుంబానికి పంపారని అమిత్షా కరైకాల్ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై నారాయణ స్వామి ఘాటుగా స్పందించారు. 'నాపై అమిత్షా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాటిని సవాలు చేస్తున్నాను. తక్షణం ఆ ఆరోపణలను అమిత్షా రుజువు చేయాలి. అలా చేయలేకపోతే దేశానికి, పాండిచ్చేరి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వ్యక్తిగతంగా నా ప్రతిష్టను, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజారుస్తూ చేసిన తప్పుడు ప్రకటనకు గాను ఆయనపై క్రిమినల్ డిఫమేషన్ కేసు వేస్తాను' అని నారాయణస్వామి అన్నారు.
Updated Date - 2021-03-01T21:46:47+05:30 IST