అస్సాం మంత్రులకు శాఖల కేటాయింపు
ABN, First Publish Date - 2021-05-12T00:09:08+05:30
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గంలోని సభ్యులకు
గువాహటి : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గంలోని సభ్యులకు శాఖలను కేటాయించారు. హోం, సిబ్బంది, ప్రజా పనులు, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలను ఆయనే నిర్వహిస్తారు.
ఏజీపీ నేత కేశబ్ మహంతకు ఆరోగ్య శాఖను కేటాయించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను కూడా అప్పగించారు. ఎన్నికల ముందు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత అజంత నియోగ్కు ఆర్థిక, సాంఘిక సంక్షేమ శాఖలను అప్పగించారు. రనోజ్ పేగుకు విద్యా శాఖ, మైదాన ప్రాంతాల తెగల సంక్షేమ శాఖలను అప్పగించారు. పరిమళ్ శుక్లబైద్య అడవులు, పర్యావరణం, మత్స్య, ఎక్సయిజ్ శాఖలను నిర్వహిస్తారు.
బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రజారోగ్యం, సివిల్ సప్లయ్స్, వినియోగదారుల వ్యవహారాల శాఖలు అప్పగించారు.
ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరాకు వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంవర్ధక, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి శాఖలను కేటాయించారు.
చంద్ర మోహన్ పటోవరికి రవాణా, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖలను అప్పగించారు.
అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఆదివారం ఎన్నికయ్యారు.
Updated Date - 2021-05-12T00:09:08+05:30 IST