హర్యానా సీఎంకు రైతు సెగ.. పర్యటన రద్దు
ABN, First Publish Date - 2021-10-13T23:44:54+05:30
హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టార్కు మరోసారి రైతు సెగ తగిలింది. ఖట్టార్కు నిరసన తెలిపేందుకు పెద్దఎత్తున ..
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టార్కు మరోసారి రైతు సెగ తగిలింది. ఖట్టార్కు నిరసన తెలిపేందుకు పెద్దఎత్తున రైతులు సోనిపట్ చేరుకోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ బుధవారంనాడు సోనిపట్లో జరపాల్సిన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. గోహనలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆయన రాక సందర్భంగా నిరసనలు తెలుపుతామంటూ రైతులు ప్రకటించడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సిటీ అంతటా పోలీసు బారికేడ్లు, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. సీఎం రాక కోసం స్టేడియం వద్ద తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు చేయడంతో, రైతు నిరసనకారులు అక్కడకు చేరుకుని ఆందోళనలకు దిగారు. పోలీసులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు.
దీనికి ముందు, గత ఆగస్టులో హర్యానాలోని కర్నల్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రైతు ప్రదర్శకులపై పోలీసులను ఉసిగొలుపుతూ వివాదాస్పద ఆదేశాలిచ్చిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా కెమెరాకు చిక్కారు. లాఠీలతో తలలు పగలగొట్టండి...అంటూ ఆ వీడియోలో సిన్హా ఆదేశాలివ్వడంతో దుమారం రేగింది. దీనిపై దర్యాపు జరిపిన అనంతరం సిన్హాను పదవి నుంచి తొలగించి నెలరోజుల సెలవుపై పంపారు. అనంతర క్రమంలో ఉత్తరపూర్లోని లఖింపూర్ ఖేర్ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం పాలవడం కూడా రైతు సంఘాల ఆగ్రహాన్ని చవిచూసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జాతీయ అంశంగా మారింది.
Updated Date - 2021-10-13T23:44:54+05:30 IST