గ్లోబల్ వార్మింగ్ను పరిమితం చేద్దాం : జీ20 నేతలు
ABN, First Publish Date - 2021-11-01T02:09:21+05:30
ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు
రోమ్ : ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడానికి అర్థవంతమైన, సమగ్ర చర్యలు తీసుకోవాలని జీ20 దేశాల నేతలు అంగీకరించారు. అయితే దీని కోసం దృఢమైన వాగ్దానాలు అంతగా కనిపించలేదు. దౌత్యవేత్తలు రోజుల తరబడి జరిపిన తీవ్ర చర్చోపచర్చల ఫలితాలు రావాలంటే, స్కాట్లాండ్లో జరిగే విస్తృత స్థాయి ఐక్య రాజ్య సమితి వాతావరణ సదస్సులో చాలా కృషి జరగవలసి ఉంది. ఈ సదస్సుకు జీ20 నేతల్లో చాలా మంది హాజరవుతారు.
ప్రపంచంలో గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 80 శాతం ఉద్గారాలు జీ20 దేశాల నుంచే వస్తున్నాయి. జీ20లో బ్రెజిల్, చైనా, భారత దేశం, జర్మనీ, అమెరికా ఉన్నాయి. ఉద్గారాలకు కళ్ళెం వేయడంపై ప్రస్తుత జాతీయ ప్రణాళికలను అవసరమైతే పటిష్టపరచాలని జీ20 సదస్సు ఫైనల్ డాక్యుమెంట్ పేర్కొంది. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ను సాధించడానికి 2050వ సంవత్సరాన్ని లక్ష్యంగా ఈ డాక్యుమెంట్ పేర్కొనకపోవడం గమనార్హం. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.
ఐక్యరాజ్య సమితి నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడం తప్పనిసరి. కరువులు, తుపానులు, వరదలు వంటి విపత్తులను తప్పించుకోవాలంటే 2050నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి.
Updated Date - 2021-11-01T02:09:21+05:30 IST