పెరంబలూరు వద్ద ఘోర రోడ్డుప్రమాదం
ABN, First Publish Date - 2021-03-01T13:21:36+05:30
జిల్లా కేంద్రం పెరంబలూరు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి చెందారు. కారు-మోటార్సైకిల్ వేగంగా ఢీకొనడంతో...
ఇద్దరు పిల్లలు సహా నలుగురి దుర్మరణం
చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి) 28: జిల్లా కేంద్రం పెరంబలూరు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి చెందారు. కారు-మోటార్సైకిల్ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పెరంబలూరు జిల్లా వెబ్బూరు ప్రాంతానికి చెందిన పాండియన్ భార్య ధనం (55), కుమారుడు శక్తివేల్ (22), కొళప్పాడి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారితో పాటు ధనం కోడలు పరమేశ్వరి (26), ఆమె పిల్లలు వెనీలా (3), తమీన్నిలవన్ (2), నందిత (2) అనేవారు ఒకే మోటారుసైకిల్పై అక్కడి నుంచి వెబ్బూరుకు ఆదివారం ఉదయం బయల్దేరారు. వారు ఇచ్చిలికుట్ట అనే ప్రాంతానికి చేరుకున్న సమయంలో వెబ్బూరు నుంచి వేటకుడి వైపుగా వెళుతున్న కారు మోటారుసైకిల్ను వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో పరమేశ్వరి, వెనీలా, నందిత, ధనంలు ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. గాయపడిన తమిళ్నిలవన్, శక్తివేల్ల ను పెరంబలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కున్నం పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-03-01T13:21:36+05:30 IST