మహారాష్ట్రలో వరద బీభత్సం
ABN, First Publish Date - 2021-07-25T06:46:29+05:30
మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో వరదలతో పాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 76 మంది మరణించారని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శనివారం తెలిపారు.
76 మంది మృతి.. 59 మంది గల్లంతు
ముంబై, జూలై 24: మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో వరదలతో పాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 76 మంది మరణించారని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శనివారం తెలిపారు. 38 మంది గాయపడగా, 59 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. రాయగఢ్ జిల్లాలోనే 47 మంది మరణించారని చెప్పారు. 9 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 90 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. అయితే, గత 48 గంటల్లో 129 మంది చనిపోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం(ఎస్డీఆర్ఎఫ్) అధికారులు చెప్పడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్ నుంచి 21, ఆర్మీ, కోస్ట్గార్డ్ నుంచి 14, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 4 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు సతారా జిల్లాలో రెండు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 13 మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్ శేఖర్సింగ్ తెలిపారు. మరికొందరు గల్లంతయ్యారని చెప్పారు.
రాష్ట్రపతి ఆరా
మహారాష్ట్రలో వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతు న్న సహాయ, పునరావాస చర్యలను గవర్నర్ ఆయనకు వివరించారు.
Updated Date - 2021-07-25T06:46:29+05:30 IST