విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌక జల ప్రవేశం 21న
ABN, First Publish Date - 2021-11-18T00:02:58+05:30
ప్రాజెక్టు 15బీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్
న్యూఢిల్లీ : ప్రాజెక్టు 15బీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక ‘విశాఖపట్నం’ను ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జల ప్రవేశం చేయిస్తారు. ముంబైలోని నావల్ డాక్యార్డులో జరిగే కార్యక్రమంలో భారత నావికా దళంలోకి దీనిని ప్రవేశపెడతారు. దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లలో ఇది మొదటిది. భారత నావికా దళానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ యుద్ధ నౌకలకు డిజైన్ చేసింది. వీటిని మజగావ్ డాక్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఈస్టర్న్ నావల్ కమాండ్ ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది.
విశాఖపట్నం యుద్ధ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, 7,400 టన్నుల బరువును మోసుకెళ్ళగలదు. భారత దేశంలో తయారైన యుద్ధ నౌకల్లో ఇది అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తున్నారు. దీనికి నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బయిన్లు ఉన్నాయి. ఇది 30 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. దీనిలో అత్యంత ఆధునిక ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగే ఆయుధాలు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్ కూడా ఉంది. అణు, జీవ, రసాయనిక ఆయుధాలతో జరిగే యుద్ధంలో కూడా ఈ నౌక దీటుగా సేవలందించగలదు.
Updated Date - 2021-11-18T00:02:58+05:30 IST