తప్పుడు వార్తలు.. వదంతులు..మూలాల వివరాలను గుర్తించాల్సిందే
ABN, First Publish Date - 2021-10-23T08:01:05+05:30
తప్పుడు వార్తలు, హింసకు ప్రేరేపించే సందేశాలు, వదంతుల మూలాలను గుర్తించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ....
కొత్త ఐటీ చట్టాన్ని అమలు చేయాల్సిందే
వాట్సాప్ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం వివరణ
ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ, అక్టోబరు 22: తప్పుడు వార్తలు, హింసకు ప్రేరేపించే సందేశాలు, వదంతుల మూలాలను గుర్తించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఐటీ చట్టాన్ని సవాలు చేస్తూ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఆ అఫిడవిట్లో వాట్సాప్ తీరును ఘాటుగా ఎండగట్టింది. ‘‘భారత్లో వ్యాపారం చేస్తున్న సోషల్మీడియా సంస్థలు.. భారత చట్టాలను గౌరవించాల్సిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం కోరిన సమాచారం ఇవ్వాల్సిందే. కొత్త ఐటీ నిబంధనల్లోని రూల్ నంబర్ 4(2) ప్రకారం.. హింసకు ప్రేరేపించే సందేశాలు, తప్పుడు వార్తలు, వదంతుల మూలాలను గుర్తించాల్సిందే. దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిందే’’ అని ఆ అఫిడవిట్లో తేల్చిచెప్పింది. తమది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానమని, మూలాలను గుర్తించడం తమ విధానాలకు విరుద్ధమని వాట్సాప్ తన పిటిషన్లో పేర్కొనడంపైనా.. అఫిడవిట్లో వివరణ ఇచ్చింది. ‘‘వాట్సాప్ 2016 యూజర్ పాలసీ.. 2021లో సవరించిన యూజర్ పాలసీని గమనించండి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తన మాతృ సంస్థ ఫేస్బుక్, ఇతర థర్డ్ పార్టీ సంస్థలకు అందజేయవచ్చని ఉంది. వ్యాపార ధోరణిలో యూజర్ల డేటాను ఇతరులకు ఇవ్వవచ్చని స్పష్టమవుతుంది. అలాంటప్పుడు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్కు అర్థమేముంది?’’ అని ప్రశ్నించింది. కోట్ల కోట్ల రూపాయల విలువ ఉన్న ఆ సంస్థకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని భంగం చేయకుండా.. సందేశాల మూలాలను కనుగొనే వ్యవస్థను అమలు చేయడం ఏమంత పెద్ద పని కాదని అఫిడవిట్లో అభిప్రాయపడింది. ఆ దిశలో చర్యలు తీసుకుని, భారత దర్యాప్తు సంస్థలు కోరే సమాచారాన్ని అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ అఫిడవిట్లో కోరింది.
Updated Date - 2021-10-23T08:01:05+05:30 IST