బీజేపీ ఎత్తుగడలు చెల్లవు: ఈడీ నోటీసుపై కేజ్రీవాల్
ABN, First Publish Date - 2021-09-13T23:13:19+05:30
ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ నోటీసుపై ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ నోటీసుపై ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ తరహా బీజేపీ ఎత్తుగడలు ఎప్పటికీ విజయవంతం కావని, పైగా ఇందువల్ల తాము మరింత బలపడతామని అన్నారు.
''ఢిల్లీలో ఐటీ శాఖ, సీబీఐ, ఢిల్లీ పోలీసుల సాయంతో మమ్మల్ని వాళ్లు ఓడించాలని అనుకున్నారు. కానీ, మేము 62 సీట్లు గెలిచాం. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్లో మేము బలపడుతుండటంతో మాకు ఈడీ నోటీసు వచ్చింది. భారతదేశ ప్రజలు నిజాయితీతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నారు. బీజేపీ పన్నుతున్న ఈ తరహా ఎత్తుగడలు ఎప్పటికీ సక్సెస్ కావు. వాళ్లే మమ్మల్ని మరింత బలవంతులను చేస్తున్నారు'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తమ పార్టీకి ఈడీ నుంచి నోటీసు వచ్చినట్టు ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా పేర్కొన్న నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు.
''మోదీ ప్రభుత్వ ఫేవరెట్ ఎజెన్సీ ..ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి తొలి లవ్ లెటర్ను ఆప్ అందుకుంది''అంటూ చద్దా దీనికి ముందు ఒక ట్వీట్ చేశారు. బీజేపీ చేస్తున్న పొలిటికల్ విచ్హంట్ను బహిర్గతం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర ప్రెస్మీట్ ఏర్పాటు చేస్తున్నానని ఆ ట్వీట్లో చద్దా పేర్కొన్నారు.
Updated Date - 2021-09-13T23:13:19+05:30 IST