Covaxin అత్యవసర అనుమతి.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ కీలక ప్రకటన!
ABN, First Publish Date - 2021-07-10T23:02:35+05:30
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవ్యాక్సిన్కు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నాలుగు నుంచి ఆరు వారాల్లోపు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా తెలిపారు.
జెనీవా: భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవ్యాక్సిన్కు అత్యవసర వినియోగ జాబితాలోకి చేర్చే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నాలుగు నుంచి ఆరు వారాల్లోపు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తెలిపారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ శుక్రవారం నాడు నిర్వహించిన వెబినార్లో పాల్గొన్న డా. సౌమ్య ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ ఓ టీకాను అత్యవసర అనుమతి జాబితాలోకి చేర్చేందుకు ముందుగా ఆ టీకాను తయారు చేసిన కంపెనీ ఫేస్ 3 క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి పూర్తి వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రెగ్యులేటరీ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. టీకా తయారీ ప్రమాణాలు, భద్రత, ప్రభావశీలతకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత నిపుణుల కమిటీ ఒకటి ఈ వివరాలను పరిశీలిస్తుంది. భారత్ బయోటెక్ ఇప్పటికే ఈ వివరాలను సమర్పించింది. కాబట్టి.. నా అంచనా ప్రకారం మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో డబ్ల్యూహెచ్ఓ ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చు’’ అని డా. సౌమ్య తెలిపారు.
Updated Date - 2021-07-10T23:02:35+05:30 IST