మోదీ ప్రభుత్వంపై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక
ABN, First Publish Date - 2021-04-14T21:20:54+05:30
పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులిచ్చే అవకాశం గతంలో కంటే ప్రస్తుతం మరింత పెరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
వాషింగ్టన్: పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులిచ్చే అవకాశం గతంలో కంటే ప్రస్తుతం మరింత పెరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా జాతియ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. రెండు దేశాలు యుద్ధానికి దిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మధ్య వివాదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ నివేదికలో అభిప్రాయపడ్డాయి. ‘పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే..లేదా అలా చేసినట్టు భారత్ భావిస్తే..మోదీ ప్రభుత్వం సైనిక శక్తి ద్వారా బదులివ్వచ్చు. గతంలో కంటే ఇప్పుడు ఈ అవకాశం మరింత పెరిగింది. ఇరు దేశాల మధ్య నెలకొనే ఉద్రిక్తతలు ఘర్షణకు దారితీసే అవకాశాలను పెంచుతాయి. కశ్మీర్లో హింస ప్రజ్వరిల్లడం, ఇతర ప్రాంతాల్లో మిలిటెంట్ దాడులు ఈ వివాదాలకు కేంద్రంగా మారొచ్చు’ అని ఈ నివేదికలో వెల్లడైంది.
కశ్మీర్కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ ప్రభుత్వం తొలగించడంతో భారత్,పాక్ల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇరు దేశాలూ తమ హైకమిషనర్లను స్వదేశానికి పిలిపించుకున్నాయి. పాక్తో దౌత్యసంబంధాలు సాధారణ స్థితికి రావాలని తాము కోరుకుంటున్నట్టు భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే.. ఉగ్రవాదం, హింసకు చోటులేని వాతావరణంలోనే ఇది సంభవమని, ఇటువంటి వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పాకిస్థాన్దేనని భారత్ స్పష్టం చేసింది. అమెరికా జాతియ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక ప్రకారం.. అప్ఘానిస్థాన్, ఇరాక్, సిరియాలో అశాంతి, హింస అమెరికా సైన్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. ఇక భారత్-పాక్ ఉద్రిక్తతలు ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశమని జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది.
Updated Date - 2021-04-14T21:20:54+05:30 IST