కోవిడ్-19 : తమిళనాడులో 3 లక్షల మందిపై కేసులు
ABN, First Publish Date - 2021-04-16T16:57:56+05:30
కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉంది. దీని నుంచి ప్రజలను
చెన్నై : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉంది. దీని నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడటంతోపాటు ప్రజల ప్రాణాలను పరిరక్షించడానికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. వీటిని కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఇదే విషయాన్ని చెప్పారు. లాక్డౌన్ విధించడం ఆచరణ సాధ్యం కాదని, మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయక తప్పదని చెప్పారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడుస్తోంది. కోవిడ్-19 నిబంధనల మేరకు మాస్క్ ధరించనివారిపై కేసులు నమోదు చేస్తోంది.
ఈ నెల 8 నుంచి 15 మధ్యలో కోవిడ్ మార్గదర్శకాల మేరకు మాస్క్ ధరించని 2,98,750 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఇదే కాలంలో భౌతిక దూరం పాటించనందుకు 11,041 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
తమిళనాడు శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పోలీసులు కోవిడ్ నిబంధనల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రజలు మాస్క్లు ధరించడం తప్పనిసరి అని చెప్తున్నారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలు ఈ మార్గదర్శకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ మార్గదర్శకాలను పాటించనివారిపై కేసులు నమోదు చేసి, వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు.
Updated Date - 2021-04-16T16:57:56+05:30 IST