జపాన్కు చైనా అణు బాంబు హెచ్చరిక... వీడియో వైరల్...
ABN, First Publish Date - 2021-07-21T01:49:14+05:30
తైవాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అణు బాంబుతో దాడి
న్యూఢిల్లీ : తైవాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అణు బాంబుతో దాడి చేస్తామని జపాన్ను చైనా హెచ్చరించింది. అణ్వాయుధాలు లేనటువంటి దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించరాదనే విధానానికి జపాన్ విషయంలో మినహాయింపు ఇస్తున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ తెలిపింది. ఈ బెదిరింపు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పార్టీ ఆమోదంగల ఓ చానల్ ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ వివరాలను ఓ ప్రముఖ అమెరికన్ న్యూస్ ఛానల్ వెల్లడించింది.
‘‘మేం మొదట అణు బాంబులను ప్రయోగిస్తాం’’ అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ వీడియోలో హెచ్చరించినట్లు ఓ ప్రముఖ అమెరికన్ న్యూస్ ఛానల్ తెలిపింది. రెండోసారి బేషరతుగా లొంగిపోతున్నట్లు జపాన్ ప్రకటించే వరకు అణు బాంబులను నిరాఘాటంగా ప్రయోగిస్తామని బెదిరించినట్లు పేర్కొంది.
తైవాన్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోను చైనాకు చెందిన జిగువా (యూట్యూబ్ వంటి వేదిక)లో ఆదివారం అప్లోడ్ చేసినట్లు తెలిసింది. క్షణాల్లోనే దీనిని 20 లక్షల మంది చూసినట్లు వెల్లడైంది. కాసేపటికే దీనిని తొలగించడం గమనార్హం. అయితే దీని కాపీలను కొందరు యూట్యూబ్, ట్విటర్లలో అప్లోడ్ చేశారు. ఇవి ఇంకా ఉన్నాయి. తైవాన్కు చైనా విముక్తి కల్పించినపుడు జోక్యం చేసుకుని చూడాలని జపాన్ను ఈ వీడియోలో సవాల్ చేశారు. ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తే భీకర యుద్ధం జరుగుతుందని బెదిరించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, చైనా-జపాన్ యుద్ధాల్లో చైనా సైనికులపై జపాన్ సైనికుల దుశ్చర్యల గురించి ప్రస్తావించారు.
దాదాపు రెండు వారాల క్రితం జపాన్ డిప్యూటీ ప్రధాన మంత్రి టారో అసో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా బెదిరింపు వీడియో విడుదలైంది. తైవాన్ను జపాన్ తప్పనిసరిగా సమర్థించాలని టారో అసో అన్నట్లు జపాన్ టైమ్స్ తెలిపింది. అయితే తైవాన్పై సంపూర్ణ సార్వభౌమాధికారం తనకే ఉందని చైనా చెప్తోంది.
Updated Date - 2021-07-21T01:49:14+05:30 IST