కొత్త ఐటీ రూల్స్పై సాధికార తీర్పు రావాలి : కేంద్రం
ABN, First Publish Date - 2021-07-07T00:41:19+05:30
కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్పై సాధికార తీర్పు
న్యూఢిల్లీ : కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్పై సాధికార తీర్పు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలన్నిటినీ అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఓ సీనియర్ న్యాయాధికారి జాతీయ మీడియాకు తెలిపారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ను సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు వివిధ హైకోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారులు, న్యాయస్థానాలు గుర్తించిన ఆన్లైన్ కంటెంట్తో తగిన విధంగా వ్యవహరించేందుకు భారత దేశంలో ఉండే ఓ అధికారిని నియమించాలని, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ నిబంధనలు చెప్తున్నాయి. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కంటెంట్ను నియంత్రించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయి.
ఈ నిబంధనలకు అనుగుణంగా రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ నియామక ప్రక్రియ జరుగుతోందని ట్విటర్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ అధికారిని ఎప్పుడు నియమిస్తారో జూలై 8నాటికి తెలియజేయాలని హైకోర్టు ట్విటర్ను ఆదేశించింది.
Updated Date - 2021-07-07T00:41:19+05:30 IST