వ్యాక్సిన్ ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం ఎత్తేయండి
ABN, First Publish Date - 2021-04-17T07:21:28+05:30
కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా విజ్ఞప్తి చేశారు.
ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడికి పూనావాలా విజ్ఞప్తి
ముంబై, ఏప్రిల్ 16 : కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా విజ్ఞప్తి చేశారు. ‘‘వైర్సపై పోరులో మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని మీరు భావిస్తే.. టీకా ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేయండి. వ్యాక్సిన్ పరిశ్రమ తరఫున ఇది నా విన్నపం’’ అనే సందేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్ హ్యాండిల్కు ఆయన ట్యాగ్ చేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగవంతం కావాలంటే ముడి పదార్థాల లభ్యత పెరగడం అత్యంత ఆవశ్యకమన్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్లపై ఫార్మా కంపెనీల మేధోసంపత్తి హక్కుల(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్)ను కొంతకాలం పాటు సడలించాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వేదిక భారత్, దక్షిణాఫ్రికాలు ఇటీవల విజ్ఞప్తి చేశాయి. ఆ దేశాల విజ్ఞప్తిని సానుకూల దృష్టితో పరిశీలించాలంటూ శుక్రవారం పలువురు సెనెటర్లు అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాశారు.
Updated Date - 2021-04-17T07:21:28+05:30 IST