Lakhimpur Kheri: ఆ రోజున ఎక్కడున్నదీ నిరూపించుకోలేకపోయిన కేంద్రమంత్రి కుమారుడు!
ABN, First Publish Date - 2021-10-10T01:39:04+05:30
లఖింపూర్ ఖేరి హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ సహాయ
లక్నో: లఖింపూర్ ఖేరి హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నేడు ఉత్తరప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఘటన జరిగిన రోజన తను అక్కడ లేనని చెబుతూ వస్తున్న ఆశిష్.. పోలీసుల ముందు నిరూపించడంలో విఫలమైనట్టు తెలుస్తోంది.
ఈ నెల 3న మధ్యాహ్నం 2.36-3.30 గంటల మధ్య లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులను తొక్కించుకుంటూ వెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తుండగా ఆ సమయంలో తాను వేరే ఊర్లో ఓ కార్యక్రమానికి హాజరైనట్టు ఆశిష్ చెప్పుకొచ్చారు. అయితే, నేడు విచారణకు హాజరైన ఆయన ఆ విషయాన్ని నిరూపించడంలో విఫలమయ్యారని సమాచారం.
అంతకుముందు ఆయన సదర్ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ స్కూటర్పై లఖింపూర్ ఖేరి పోలీస్ లైన్స్లో ఉన్న క్రైం బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ సందర్భంగా అధికారులు ఆయన మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై యూపీ ప్రభుత్వాన్ని నిన్న సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Updated Date - 2021-10-10T01:39:04+05:30 IST