ముస్లింల ఓట్ల కోసం Akhilesh మతం మారవచ్చు...యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-11-04T13:23:21+05:30
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన ఆరోపణలు చేశారు...
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా సంచలన ఆరోపణలు చేశారు. అఖిలేష్ పాక్ గూడచారి సంస్థ ఐఎస్ఐ మద్ధతు పొందుతున్నాడని, ముస్లింలను మభ్యపెట్టేందుకు ఆయన మతమార్పిడికి పాల్పడే అవకాశం ఉందని మంత్రి శుక్లా ఆరోపించారు.ఐఎస్ఐ నుంచి అఖిలేష్కు ఆర్థిక సహాయం అందుతుందని మంత్రి చెప్పారు.‘‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇస్లామిక్ ప్రపంచానికి సవాలుగా మారారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు ఐఎస్ఐ నుంచి మద్దతు లభిస్తోంది.’’అని బీజేపీ నాయకుడు శుక్లా అన్నారు.
ఆదివారం హర్దోయ్లో యాదవ్ తన ప్రసంగంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ,పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాల గురించి మాట్లాడిన తర్వాత శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి అఖిలేష్ యాదవ్ ‘నమాజ్’ చేశాడు ‘రోజా’ పాటించాడు. అతను ముస్లింల ఓట్లను పొందడానికి మత మార్పిడి చేసుకొని ‘ఖత్నా’కు కూడా వెళ్లవచ్చు’’ అని మంత్రి శుక్లా ఆరోపించారు.
ఐఎస్ఐ ఆదేశాల మేరకే యాదవ్ జిన్నాను కీర్తిస్తున్నారని.. పాకిస్థాన్, తాలిబన్లు కోరుకునేలా ఆయన ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శుక్లా ఆరోపించారు.యాదవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ను జిన్నాతో పోల్చడం ఖండించదగినదని, అందుకు అఖిలేష్ పశ్చాత్తాప పడాలని శుక్లా పేర్కొన్నారు.
Updated Date - 2021-11-04T13:23:21+05:30 IST