భారత్ విమానానికి కాబూల్లో ల్యాండింగ్ కష్టాలు
ABN, First Publish Date - 2021-08-15T23:16:55+05:30
ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్ళిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్
కాబూల్ : ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్ళిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబూల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఈ విమానం సుమారు గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టవలసి వచ్చింది. ఓ దశలో పైలట్ విమానం రాడార్ను స్విచాఫ్ చేశారు. ఈ విమానాన్ని శత్రువులు గుర్తించి, టార్గెట్ చేస్తారేమోననే ఉద్దేశంతో రాడార్ను స్విచాఫ్ చేశారు. ఉద్విగ్న వాతావరణంలో ఓ గంట ఆలస్యంగా ఎట్టకేలకు ఈ విమానం ల్యాండ్ అయింది.
ఎయిరిండియా ఫ్లైట్ 243 ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. కాబూల్ నగరానికి ప్రయాణ కాలం 2 గంటల 20 నిమిషాలు. కాబూల్ శివారులో తాలిబన్ ఉగ్రవాదులు ఉన్నారు. అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ విమానం ఆకాశంలోనే ఎగురవలసి వచ్చింది. నాటకీయ పరిణామాల తర్వాత ఓ గంట ఆలస్యంగా దిగింది. కాబూల్లోని భారతీయ దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది భారత దేశానికి ఈ విమానంలో తిరిగి రావలసి ఉంది.
కాందహార్, మజారే షరీఫ్ నగరాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలను స్థానిక సిబ్బందికి అప్పగించారు. ఈ కార్యాలయాల్లోని భారతీయ సిబ్బందిని ప్రత్యేక విమానాల ద్వారా తరలించారు.
ప్రస్తుతం ఎయిరిండియా 243 విమానం కాబూల్ విమానాశ్రయంలో ఉంది. ఇంధనాన్ని నింపుకుని, ఢిల్లీకి బయల్దేరవలసి ఉంది.
Updated Date - 2021-08-15T23:16:55+05:30 IST