ఉద్ధవ్పై కేసు నమోదుకు బీజేపీ నేత డిమాండ్
ABN, First Publish Date - 2021-08-26T01:10:54+05:30
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చెప్పుతో
ముంబై : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చెప్పుతో కొట్టాలని పిలుపు ఇచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేత నితిన్ భుటడ డిమాండ్ చేశారు. నితిన్ ఈ మేరకు ఉమెర్ఖేద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ భుటడ చేసిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, 2020 అక్టోబరు 25న దసరా సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
‘‘ఓ యోగి ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారు? ఆయన ఓ గుహలో కూర్చోవాలి. ఆయన చెప్పుతోనే ఆయనను కొట్టాలి. శివాజీ మహారాజును యోగి అవమానించారు. శివాజీ మహారాజు వద్దకు వెళ్ళే తాహతు యోగికి లేదు. యోగి మహారాష్ట్రకు వస్తే ఆయన చెప్పుతోనే ఆయనను కొట్టాలి. నేను చెప్పుతో కొట్టేవాడిని’’ అని ఉద్ధవ్ థాకరే రెచ్చగొట్టారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు. ఉద్ధవ్ వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని, అల్లర్లను ప్రేరేపించే అవకాశం ఉందన్నారు. ఉద్ధవ్పై మహారాష్ట్రలోని అనేక పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తారని నితిన్ చెప్పారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణే ఇటీవల ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాణేను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం బెయిలుపై విడుదలయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో ఉద్ధవ్కు తెలియదని, ప్రసంగం మధ్యలో ఈ విషయాన్ని తన సహచరులను అడిగారని, ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే, ఆయన చెంప చెళ్ళుమనిపించి ఉండేవాడినని రాణే అన్నారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు.
Updated Date - 2021-08-26T01:10:54+05:30 IST