2026లో అధికారం మాదే
ABN, First Publish Date - 2021-07-17T12:42:15+05:30
ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధి కారం తమదేనని, ఆ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలకు సాధించి తీరు తామని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. తాంబరం వద్ద శుక్రవారం జరిగిన స
- 150 సీట్లలో విజయం సాధిస్తాం ఫ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు అన్నామలై
- అట్టహాసంగా పదవీస్వీకారం
చెన్నై: ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధి కారం తమదేనని, ఆ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలకు సాధించి తీరు తామని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. తాంబరం వద్ద శుక్రవారం జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో తనకు పార్టీ పగ్గాలను అప్పగించిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి పాటుపడతా నన్నారు. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చి 69 రోజులయిందని, అంతలోనే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లి, పాలనను ఏవగించు కుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి నలుగురు శాసనసభ్యులు ఉన్నారని, ఈ సంఖ్య త్వరలోనే అధికమవుతుందని, 2026 శాసనసభ ఎన్నికల్లో 150 నియోజకవర్గాల్లో గెలిచి అధికారం చేపడతామన్నారు. పశ్చిమబెంగాల్లో గతంలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 77కు పెరిగిందని, అదేవిధంగా రాష్ట్రం లోనూ తమ పార్టీ అధికారాన్ని చేరుకోవడం ఖాయమన్నారు.
అట్టహాసంగా ప్రమాణస్వీకారం..
రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై శుక్రవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎల్.మురుగన్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడంతో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. అదే రోజున బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు అన్నామలైకి అధిష్టానవర్గం పార్టీ పగ్గాలను అప్పగించింది. తన స్వస్థలం నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి హోదాలో నగరానికి విచ్చేసిన అన్నామలైకి పలు చోట్ల పార్టీ శ్రేణులు పుష్పవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేం దుకు ఈ నెల 14న అన్నామలై చెన్నై బయల్దేరారు. పల్లడం, తిరుప్పూరు. పెరుంతురై, ఈరోడ్, శంకగిరి, సేలం, నామక్కల్, పరమత్తివేలూరు, కరూరు, కుళిత్తలై మీదుగా తిరుచ్చి నగరానికి చేరుకున్నారు. గురువారం ఉదయం తిరుచ్చి నుంచి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు వెంటబెట్టుకుని ఊరేగింపుగా బయల్దేరి పెరంబలూరు, వేప్పూరు ఉళుందూరుపేట, విల్లుపురం, మేల్మరు వత్తూరు, మధురాంతకం, చెంగల్పట్టు, గుడువాంజేరి మీదుగా రాత్రి 11 గంటలకు తాంబరం చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేశారు. శుక్రవారం ఉదయం తాంబరంలో బీజేపీ రాష్ట్ర శాఖ తొలి అధ్యక్షుడు నారాయణరావు నివాసగృహానికి వెళ్ళిన అన్నామలై.. దివంగత నేత చిత్రపటం వద్ద నివాళు లర్పించారు. తర్వాత అక్కడి నుంచి కార్యకర్తలతోపాటు ఊరేగింపుగా చెన్నై బయల్దేరారు. మధ్యాహ్నం 1.30 గంటలకు టి.నగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయానికి చేరుకున్నారు. అక్కడ మంగళవాయిద్యాల నడుమ, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తరువాత కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్, బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి సీటీ రవి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఇల గణేశన్, పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, హెచ్ రాజా, నయనార్ నాగేంద్రన్, పార్టీ శాసనసభ్యులు అన్నామలైని పూలమాలలతో, శాలువలతో ఘనంగా సత్కరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు అన్నామలై పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Updated Date - 2021-07-17T12:42:15+05:30 IST