అధిక రక్తస్రావంతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ABN, First Publish Date - 2021-06-12T22:37:48+05:30
మీ అమ్మగారి వయసు రీత్యా మెనోపాజ్కు దగ్గరలో ఉన్నారు. సాధారణంగా నలభై ఐదు నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఎప్ప్పుడైనా మెనోపాజ్ రావొచ్చు. మెనోపాజ్ మొదలయ్యే నాలుగైదు సంవత్సరాల
ఆంధ్రజ్యోతి(12-06-2021)
ప్రశ్న: మా అమ్మకు యాభై సంవత్సరాలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి?
- శ్రావ్య, కదిరి
డాక్టర్ సమాధానం: మీ అమ్మగారి వయసు రీత్యా మెనోపాజ్కు దగ్గరలో ఉన్నారు. సాధారణంగా నలభై ఐదు నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఎప్ప్పుడైనా మెనోపాజ్ రావొచ్చు. మెనోపాజ్ మొదలయ్యే నాలుగైదు సంవత్సరాల ముందే ఆరోగ్యంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. నెలసరి క్రమం తప్పి రావడం, అధిక రక్తస్రావం కావడం, ఉత్సాహం తగ్గడం, జుట్టు రాలడం, బరువు తేడా రావడం, చర్మం పొడిబారడం లాంటి లక్షణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అధిక రక్తస్రావం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోయి రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి మాంసాహారులైతే కోడి, చేప వంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది. శాకాహారులైతే అన్నిరకాల పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్, చిక్కుళ్లు మొదలైన గింజలను రోజూ తీసుకోవాలి. ఇంకా ప్రతి పూటా తోటకూర, పాలకూర, గోంగూర లాంటి ఆకుకూరలు తప్పనిసరి. వీటిల్లో ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతం ఆరోగ్యకరంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. రోజూ కనీసం ఐదారు బాదం గింజలు, రెండు ఆక్రోట్ తీసుకోండి. కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, పనీర్ కూడా మంచివే. అన్నం తక్కువ మోతాదులో, కూర, పప్పు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, సలాడ్లు, బఠాణీలు, సెనగలు, మరమరాలు వంటివి మంచి స్నాక్స్గా పనికొస్తాయి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)
Updated Date - 2021-06-12T22:37:48+05:30 IST