లక్షల మందికి ఉద్యోగులున్నాయి.. టెక్నీషియన్లే లేరు..!
ABN, First Publish Date - 2021-12-27T18:10:02+05:30
హైదరాబాద్లో లక్షల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశాలున్నాయని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. నైపుణ్యం కలిగిన ప్లంబర్, ఎలక్ర్టీషియన్లు దొరకడం లేదని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ఆస్పత్రులకు...
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్లో లక్షల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశాలున్నాయని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. నైపుణ్యం కలిగిన ప్లంబర్, ఎలక్ర్టీషియన్లు దొరకడం లేదని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ఆస్పత్రులకు కొత్త మిషన్లు అందిస్తే చాలా ప్రాంతాల్లో వాటిని నడిపించే టెక్నీషియన్లు లేరని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అలూమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అలుమ్ని మీట్-2021 నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ, ఉస్మానియా వర్సిటీలో అనేక రంగాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు వివిధ స్థాయిల్లో స్థిరపడ్డారని అన్నారు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా డిగ్రీలను పొందాలని సూచించారు.
నేటి పరిస్థితుల్లో కెమికల్, టెక్నాలజీ లేకుండా ప్రపంచం లేదని, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకురావడంలో కెమికల్ ఫార్మా ప్రధానంగా పనిచేసిందని చెప్పారు. బయో టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఫార్మా, మార్కెటింగ్ రంగాలు ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని అన్నారు. జాతీయ విద్యా విధానం-2021 చారిత్రాత్మకమైనదని అన్నారు. ఓయూలో మరిన్ని ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు అలూమ్ని దోహదపడటాన్ని అభినందించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, మినిస్ర్టీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవల్పమెంట్ కమిషనర్ డి.చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీవీ. బసవరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-27T18:10:02+05:30 IST