పిల్లలకు పరీక్ష.. టీచర్లకు మార్కులు!
ABN, First Publish Date - 2021-12-06T15:37:45+05:30
కరోనా కారణంగా..
మార్కులు తగ్గితే.. పదోన్నతులకు మూడినట్లే!!
ఇంక్రిమెంట్లపైనా ప్రతికూల ప్రభావానికి చాన్స్
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఎన్పీఏపీ చిచ్చు
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత.. ఇటీవల గురుకులాల్లో ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్ కల్లోలం సమయంలో ఆన్లైన్ తరగతులను నిర్వహించినా.. విద్యార్థులకు ఆ చదువు ఒంటబట్టలేదనేది నిర్వివాదాంశం. ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభమైనా.. ప్రస్తుతానికి బేసిక్స్పైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు గందరగోళంగా మారింది. పిల్లలకు చదవడం, రాయడం, సబ్జెక్టుపై ఎంత వరకు పట్టు ఉన్నదనే విషయాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా టీచర్లకు మార్కులు వేస్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం మెరుగుపరిచే పేరుతో సామర్థ్య మదింపు నూతన విధానాన్ని(ఎన్పీఏపీ) ప్రవేశపెట్టారు. ఏ ఇతర గురుకుల విద్యా సంస్థల్లో లేని విధంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోనే ఈ విధానాన్ని అమలు చేయడం పట్ల టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడి చదవడం, రాయడానికి దూరంగా ఉన్న విద్యార్థులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంటే వారికి పరీక్షలు పెట్టి టీచర్లకు మార్కులు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సరిగా రాయకపోయినా, చదవకపోయినా టీచర్లకు తక్కువ మార్కులు వేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన టీచర్లకు భవిష్యత్తులో ఇంక్రిమెంట్లలో కోత, పదోన్నతుల్లో ప్రభావం చూపేలా ఉన్నతాధికారులు ఎన్పీఏపీ విధానాన్ని రూపొందించారు. గత కార్యదర్శి ప్రవేశపెట్టిన ఎన్పీఏపీ వాస్తవ పరిస్థితిని సమీక్షించకుండానే ప్రస్తుత విద్యా సంవత్సరంలో యథావిధిగా కొనసాగించడం సరైంది కాదని టీచర్లు మండిపడుతున్నారు. ఇటీవల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్రోస్ను కలిసిన టీచర్ల సంఘాలు.. ఎన్పీఏపీ రద్దుకు సంబంధించి వినతిపత్రం అందించాయి. ఎన్పీఏపీ రద్దుకు అవసరమైతే ప్రభుత్వం వద్దకు వెళ్తామని సొసైటీ టీచర్లు, టీచర్ల సంఘాలు పేర్కొంటున్నాయి.
సొంత డబ్బులతో వెళ్లాల్సిందే..
ఎన్పీఏపీ కోసం ఒక గురుకులంలో పనిచేస్తున్న టీచర్లను మరో గురుకులానికి పంపిస్తున్నారు. ఏ రోజు ఎక్కడికి వెళ్లాలనేది సదరు టీచరుకు ఇన్చార్జిలు ముందుగానే సమాచారం ఇస్తారు. కొద్ది గంటల ముందు హైదరాబాద్లోని కార్యదర్శి కార్యాలయం నుంచి సదరు టీచరుకు కొన్ని ప్రశ్నలు వాట్సాప్లో పంపుతారు. ఆయా ప్రశ్నల్ని విద్యార్థులను అడిగి, రాయించి, చదివించి వారు చూపించే ప్రతిభ ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన షీట్లో ఆ సబ్జెక్టు టీచరుకు మార్కులు వేస్తారు. ఒక గురుకులంలో పనిచేస్తున్న టీచరును మరో గురుకులానికి పంపిస్తున్నారు. అయితే ఇందుకోసం టీఏ, డీఏలు చెల్లించకపోవడంతో సొంత డబ్బుల్ని ఖర్చు చేసుకుని వెళ్లాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2021-12-06T15:37:45+05:30 IST