రెండుదశాబ్దాల ప్రయాణం
ABN, First Publish Date - 2021-10-08T07:31:46+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగపదవి చేపట్టి ఇరవైయేళ్ళయింది. 2001 అక్టోబరు 7వతేదీన ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏకధాటీగా పదమూడేళ్ళు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగపదవి చేపట్టి ఇరవైయేళ్ళయింది. 2001 అక్టోబరు 7వతేదీన ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏకధాటీగా పదమూడేళ్ళు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ తరువాత దేశప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్ళుగా కొనసాగుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం తన ఈ ప్రయాణం ఆరంభమైనా ఎన్నడూ ప్రధాని అవుతానని మాత్రం ఊహించలేదని గురువారం మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాట ఏదో మర్యాదకు అని వుండవచ్చునేమో కానీ, ప్రధాని కావాలన్న లక్ష్యాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచే ప్రణాళికలు వేశారనీ, ప్రయత్నాలు ఆరంభించారనీ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటారు. ఏది ఏమైనా నరేంద్రమోదీ ప్రస్థానం, ప్రభావం విశేషమైనవి.
‘చప్పన్నారు ఇంచీల ఛాతీ’ని రుజువుచేసుకోవడం కోసం ఆయన చాలా దూకుడు నిర్ణయాలు తీసుకున్నమాట నిజం. ఆ దూకుడు తనం దేశానికి మేలు చేసిందా, కీడు చేసిందా అన్నది అటుంచితే, ఎక్కువమంది ప్రజల్లో ఆయనపట్ల క్రేజ్ కొనసాగడానికి అదే కారణం. కాంగ్రెస్ను అవినీతిమయమైన పార్టీగా చిత్రీకరించడంలో భాగంగా, అప్పట్లో దానిమీద ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకొనే క్రమంలో 2014సార్వత్రక ఎన్నికల సమయంలో నల్లధనం మీద యుద్ధాన్ని ప్రకటించారాయన. స్విస్బ్యాంకు నుంచి తెచ్చి ప్రతీ సామాన్యుడి బ్యాంకు ఎకౌంట్లోనూ కొన్ని లక్షలు వేస్తానన్నారు. ఆ తరువాత రెండేళ్ళకు నవంబరు ౮ రాత్రి పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ఓ పెద్ద సంచలనం సృష్టించారు. దీనివల్ల నల్లధనం వెలుగులోకి రాదనీ, ఆర్థికరంగంమీద దీర్ఘకాలిక దుష్ర్పభావాలుంటాయని ఆర్థికవేత్తలు అప్పట్లో అన్నారు. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో ఒక రాజకీయపార్టీని ఆర్థికంగా దెబ్బతీయడం అసలు రహస్యమని మరికొందరన్నారు. దీనికి రెండునెలల ముందు కశ్మీర్లోని ఊరి సెక్టార్లో ఆర్మీ ప్రధాన కార్యాలయం మీద ఉగ్రవాదులు దాడిచేసినందుకు ప్రతిగా, పదిరోజుల్లోనే భారత పారామిలటరీ కమాండోలు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోకి చొరబడిమరీ అక్కడి ఉగ్రవాద కేంద్రాలను ధ్వసం చేశారు. అలాగే, 2019లో పుల్వామాలో నలభైమంది సైనికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత యుద్ధ విమానాలు పీవోకేలోకి చొచ్చుకుపోయి ఉగ్రస్థావరాలను భస్మం చేశాయి. ఇటువంటి సందర్భాల్లో పలు విమర్శలూ అనుమానాలు, ప్రతీకార దాడుల వాస్తవిక ప్రభావాలూ ప్రయోజనాలమీద సందేహాలూ రేగడం సహజమే కానీ, వాటన్నింటినీ త్రోసిరాజని మోదీ తనను తాను ఓ సాహసిగా ప్రజల్లో నిలుపుకొనేందుకు ఇవి ఉపకరించాయి. ముమ్మారు తలాక్ రద్దు విషయంలో ఆయన ప్రభుత్వం చూపిన పట్టుదల, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలను సృష్టించడం, ఈ క్రమంలో దాదాపు ఏడాదిపాటు రాజకీయనాయకులను నిర్బంధించడం, ప్రజలను నియంత్రించడం మోదీ–అమిత్ షా వైఖరికి నిదర్శనాలు. అర్టికల్ 370 రద్దునుంచి అయోధ్య రామమందిర నిర్మాణం వరకూ ఆయన పార్టీ పెద్దలు ఎందరో కన్న కలలను ఈయన నెరవేర్చారు. ఈ సాహసాలతో పాటు, ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడి స్వచ్ఛభారత్ మిషన్ ఆరంభించడం, ఇరవైకోట్ల జన్ధన్ ఖాతాలను ఆరంభించడం, ఆయుష్మాన్ భారత్తో పేదలకు ఆరోగ్యాన్నీ బీమానూ అందించడం సంక్షేమానికి కొన్ని ఉదాహరణలు. భుజ్ భూకంపం నుంచి కొవిడ్ నియంత్రణ వరకూ అంటూ ఈ ఇరవైయేళ్ళకాలంలో సంక్షోభాలను, సమస్యలను పరిష్కరించే విషయంలో మోదీ సమర్థతను కొందరు విశ్లేషిస్తున్నారు. నిర్ణయాల ప్రభావాన్ని ప్రజలు అర్థంచేసుకొనేలోగా మరో కొత్త మోదీ వారి ముందు ప్రత్యక్షమవుతూంటారు. మోదీ అచ్చేదిన్ కాదు, చచ్చేదిన్ తెచ్చారని విపక్షాలు అంటాయి. రక్షణ రంగం సహా అంతా అమ్మేస్తూంటే ఇక ఆత్మనిర్భరత ఎక్కడిదంటాయి. ఆయన ప్రతీ నిర్ణయంలోనూ గిట్టని వారికి రాజకీయమే కనిపిస్తే, అభిమానులకు మాత్రం ఆయన సాహసం, చెరగని ముద్ర కనిపిస్తాయి.
Updated Date - 2021-10-08T07:31:46+05:30 IST