వృద్ధులకు సీటు కోటాపై ఆర్టీసీ ఉదాసీనత
ABN, First Publish Date - 2021-08-06T06:12:26+05:30
పసిపిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు ఆపదనెదుర్కొన్నప్పుడు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది...
పసిపిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు ఆపదనెదుర్కొన్నప్పుడు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. దాంతో బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో మానవహక్కుల సంస్థను ఆశ్రయిస్తున్నారు. వారి ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి మానవహక్కుల సంస్థ మూడేళ్లకు పైగా సమయం తీసుకుంటోంది. 60 ఏళ్లకు పైబడ్డ సీనియర్ సిటిజన్లు, 80–90 ఏళ్లకు పైబడ్డ సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రయాణ సౌలభ్యం కోసం ఆర్టీసీ బస్సులో సీట్లు కేటాయిస్తూ ఎనిమిదేళ్ల క్రితం యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. రిజర్వు చేసిన సీట్లు సీనియర్ సిటిజన్లకే లభించేలా చూడాలని బస్ సిబ్బందిని ఆదేశించింది. అయినా ఆ సీట్లను ఇతరులు ఆక్రమించినపుడు వారికి నచ్చజెప్పి సీనియర్ సిటిజన్లకు దక్కేలా చేయడం తమ బాధ్యత కాదనేలా వారు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వృద్ధులు ప్రయాణంలో ఇబ్బందిపడక తప్పడం లేదు. రిజర్వేషన్ల ప్రక్రియను పర్యవేక్షించి నివేదిక సమర్పించాల్సిన చెకింగ్ సిబ్బంది నిష్ర్కియాపరత్వానికి పాల్పడుతోంది. కర్ణాటక బస్సులలో వృద్ధులకు కేటాయించిన సీట్లను చెకింగ్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఆక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం సిబ్బంది ఇది ఏమాత్రం పట్టించుకోదగిన అంశమే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రాంతీయ మేనేజరు దృష్టికి తీసుకెళ్ళగా ఆయన తాఖీదులిచ్చినా, రిజర్వేషన్ నిబంధనను తమ పరిధిలో తప్పకుండా అమలు చేస్తున్నట్లు డిపో మేనేజర్లు తప్పుడు సమాచారం అందించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ అంశంతో సహా సీనియర్ సిటిజన్లకు ఉన్న హక్కులను ఉల్లంఘిస్తున్న ఫిర్యాదులపై మానవహక్కుల సంస్థ సత్వర చర్యలు తీసుకోవాలి.
గుండాల రామకృష్ణయ్య
చౌడేపల్లి, చిత్తూరు జిల్లా
Updated Date - 2021-08-06T06:12:26+05:30 IST