ఆక్సిజన్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్ అరెస్ట్
ABN, First Publish Date - 2021-06-27T10:58:19+05:30
బీహార్లోని నలంద జిల్లా క్రైమ్ బ్రాంచ్ ఒక కీలక కేసును ఛేదించింది.
న్యూఢిల్లీ: బీహార్లోని నలంద జిల్లా క్రైమ్ బ్రాంచ్ ఒక కీలక కేసును ఛేదించింది. ఆక్సిజన్ సిలిండర్ల పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టుచేసింది. ఈ ముఠా లీడర్ ఛోటు చౌదరిని అరెస్టు చేసింది. ఇతను ఆక్సిజన్ సిలిండర్ల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడనే ఆరోపణలున్నాయి. ఇంతే కాదు ఈ ముఠా అక్రమంగా వందకు పైగా కోడి పందాలు నిర్వహించి, మోసాలకు పాల్పడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇటువంటి ఘటనలపై పలు ఫిర్యాదులు అందిన నేపధ్యంలో ఢిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో నలందాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ లీడర్ ఛోటు చౌదరి బహదూర్పూర్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మాటువేసి, ఛోటు చౌదరిని అరెస్టు చేశారు. ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చోటు చౌదరి తన అనుచరులతో కలసి ఆన్లైన్లో మోసాలకు పాల్పడేవాడు. అయితే కరోనా కాలంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మందులను అందిస్తామంటూ మోసాలకు పాల్పడ్డాడు. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పళని గ్రామంలో నివసించే ఛోటూ చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు.
Updated Date - 2021-06-27T10:58:19+05:30 IST