డ్యామ్లోని నీటిలో తేలుతున్న మృతదేహం.. చిన్న గొడవకే తండ్రిని హత్య చేశారంటూ కుమిలిపోతున్న కుమారుడు
ABN, First Publish Date - 2021-10-13T14:18:53+05:30
బీహార్లోని బాంకాలో జరిగిన ఒక హత్య సంచలనంగా..
బీహార్లోని బాంకాలో జరిగిన ఒక హత్య సంచలనంగా మారింది. అమర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్ గడౌల్ గ్రామంలోని డ్యామ్లోని నీటిలో ఒక మృతదేహం కనిపించింది. అది గ్రామానికి చెందిన ఉపేంద్ర ఉరఫ్ ఓపీ మండల్దిగా పోలీసులు గుర్తించారు. ఉపేంద్ర గ్రామంలో చేపలు విక్రయిస్తుంటాడు. గతంలో చేపలు పట్టే విషయమై జరిగిన గొడవల కారణంగానే ఉపేంద్ర హత్య జరిగివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి తెలియగానే అమర్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి సఫ్దర్ అలీ పోలీసు బలగాలతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గులాలీజోర్ డ్యామ్లో తేలుతున్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై వివిధ చోట్ల గాయాల గుర్తులున్నాయి.
పోలీసులు శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించారు. ఉదయాన్నే పొలాలకు వచ్చిన రైతులు ఈ మృతదేహం.. డ్యామ్లోని నీటిలో తేలుతుండటాన్ని గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు జయకాంత్ మండల్ మాట్లాడుతూ తన తండ్రి బరియార్ ప్రాంతానికి వెళ్లి, మరి తిరిగిరాలేదన్నారు. దీంతో గ్రామంలో గాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తెల్లరేసరికి తన తండ్రి మృతదేహం డ్యామ్లో తేలుతున్నదని తెలిసిందన్నారు. వారం రోజుల క్రితం చేపలు పట్టే విషయమై గ్రామానికి చెందిన ఖసియా మండల్కు, తన తండ్రికి గొడవ జరిగిందన్నారు. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారన్నారు. అప్పుడు ఆ వర్గానికి చెందిన ఇద్దరు తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని జయకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-13T14:18:53+05:30 IST