ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీకి 5 ఏళ్ల జైలు
ABN, First Publish Date - 2021-01-09T07:52:46+05:30
ముంబై పేలుళ్ల సూత్రధారి లష్కరే కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.
లాహోర్, జనవరి 8 : ముంబై పేలుళ్ల సూత్రధారి లష్కరే కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. లఖ్వీ కేసును విచారించిన లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి ఇజాజ్ అహ్మద్ బుట్టార్ ఆయనపై శిక్షను ఖరారుచేస్తూ తీర్పును ప్రకటించినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. పాక్ కోర్టు తీర్పుపై అమెరికా హర్షం వ్యక్తంచేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నాడన్న అభియోగాలపై పంజాబ్ ప్రావిన్స్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ఆయనను గత శనివారం అరెస్టు చేసింది.
ముంబై బాంబుపేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీ 2015 నుంచి బెయిల్పై ఉన్నారు. రావల్పిండి జైలు నుంచి బెయిల్పై 2015 విడుదలైన లఖ్వీ ఇంతవరకు ఎక్కడ ఉన్నాడన్న విషయం బయటిప్రపంచానికి తెలియలేదు. కాగా, తనపై అనవసరంగా తప్పుడు కేసులు బనాయించారని విచారణ సందర్భంగా లఖ్వీ కోర్టు ఎదుట వాదించాడు. ఆయన వాదనలను పంజాబ్ ప్రావిన్స్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ఖండించింది.
Updated Date - 2021-01-09T07:52:46+05:30 IST