కారును ఢీకొన్న లారీ: నవ దంపతుల దుర్మరణం
ABN, First Publish Date - 2021-11-02T14:44:32+05:30
తిరువళ్లూరు సమీపంలో సోమవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందారు. అరకోణంకు చెందిన మనోజ్ కుమార్(31), తాంబరం ప్రాంతానికి చెందిన డాక్టర్
చెన్నై(Tamilnadu): తిరువళ్లూరు సమీపంలో సోమవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందారు. అరకోణంకు చెందిన మనోజ్ కుమార్(31), తాంబరం ప్రాంతానికి చెందిన డాక్టర్ కార్తీక(30)తో ఈనెల 28న వివాహం జరిగింది. మనోజ్కుమార్ మందుల వ్యాపారం చేస్తున్నారు. ఈ దంపతులు తాంబరంలోని కార్తీక ఇంటిలో మూడు రోజులున్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరూ కారులో అరకోణంకు బయలుదేరారు. ఆ కారు తిరువళ్లూరు సమీపం పెరంబాక్కం వద్ద పూందమల్లి-అరకోణం రహదారిలో వెళుతుండగా అరక్కోణం నుంచి చెన్నైకి సిమెంట్ ట్యాంకర్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. మనోజ్కుమార్, కార్తీక తీవ్రంగా గాయపడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సుమారు రెండు గంటల సేపు శ్రమించి కారు శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు దిగ్ర్భాంతి చెందిన బోరున విలపించారు.
Updated Date - 2021-11-02T14:44:32+05:30 IST