శ్మశానవాటికలో పైకప్పు కూలి 23 మంది మృతి
ABN, First Publish Date - 2021-01-04T06:48:32+05:30
బంధువు అంత్యక్రియలకు వచ్చి, వారు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. శ్మశానవాటికలో పైకప్పు కూలి 23 మంది అక్కడికక్కడే చనిపోయారు.
అంత్యక్రియలకు వచ్చి కానరాని లోకాలకు
వర్షం వస్తుండడంతో తలదాచుకునేందుకు..
ఉత్తరప్రదేశ్లో దుర్ఘటన.. సీఎం దిగ్ర్భాంతి
మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం
ఘటనపై విచారణకు ఆదిత్యనాథ్ ఆదేశం
ఘజియాబాద్, జనవరి 3: బంధువు అంత్యక్రియలకు వచ్చి, వారు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. శ్మశానవాటికలో పైకప్పు కూలి 23 మంది అక్కడికక్కడే చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్ జిల్లాలోని ఉఖ్లార్సీ అనే గ్రామంలో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతున్నపుడు వర్షం కురుస్తోంది. ఆ సమయంలో శ్మశానవాటికలో ఓ నిర్మాణం కింద తలదాచుకున్న వారి మీద పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది.
ప్రమాదం జరిగిన అనంతరం గ్రామస్థులు, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించారు. గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
Updated Date - 2021-01-04T06:48:32+05:30 IST