అత్యాచారం కేసులో వృద్ధుడికి 14ఏళ్ల జైలు
ABN, First Publish Date - 2021-04-20T12:26:20+05:30
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిగుడ్లు సరఫరా చేసే లేబర్గా పనిచేస్తున్నాడు.
హైదరాబాద్ సిటీ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వృద్ధునికి ఎల్బీనగర్ న్యాయ స్థానం 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు.. రూ.20వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాగ్పూర్ ప్రాంతానికి చెందిన సంజయ్(58) బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిగుడ్లు సరఫరా చేసే లేబర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న దంపతులు కూలి పనులు చేసుకుంటున్నారు. వారికి ట్విన్స్(6) ఆడపిల్లలు ఉన్నారు. 2017 ఆగస్టులో తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఆ ఇంటిలోకి చొరబడిన సంజయ్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సాక్ష్యాధారాలను సేకరించి నిందితునిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో సమర్పించారు. ప్రత్యేక పోక్సో న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి సురేష్ నిందితుడికి 14 ఏళ్ల కారాగార శిక్షతో పాటు.. రూ.20వేల జరిమానా విధించారు.
Updated Date - 2021-04-20T12:26:20+05:30 IST