తెలంగాణలో మరో రెండు సోలార్ ప్రాజెక్టులు అదానీ గ్రీన్ చేతికి
ABN, First Publish Date - 2021-03-25T06:04:49+05:30
తెలంగాణలో 74.94 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ సొంతం చేసుకోనుంది. వీటి విలువ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణలో 74.94 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ సొంతం చేసుకోనుంది. వీటి విలువ రూ.446 కోట్లు. ఈ ప్రాజెక్టుల కొనుగోలుకు స్టెర్లింగ్ అండ్ విల్సన్తో ఒప్పందం కుదుర్చుకుంది. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణకు ఏర్పాటు చేసిన రెండు స్పెషల్ పర్పస్ వేహికల్స్ (ఎస్పీవీ)లో 100 శాతం వాటాను అదానీ గ్రీన్ కొనుగోలు చేస్తోంది. మెదక్ జిల్లాలో 2017లో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ ఈ ప్రాజెక్టుల విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. రెండు, మూడు రోజుల క్రితమే తెలంగాణలోని 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును కొనుగోలు చేయడానికి స్కైపవర్ గ్లోబల్తో అదానీ గ్రీన్ ఒప్పందం కుదుర్చుకుంది.
అదానీ రోడ్ ట్రాన్స్పోర్టుకు ప్రాజెక్టు.. : కోదాడ నుంచి ఖమ్మం వరకూ 32 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల రహదారిని (ఎన్హెచ్-365ఏ) నిర్మించడానికి అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్కు పనులు లభించాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ.1,040 కోట్లు. హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద ఈ రహదారిని నిర్మిస్తారు. నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది.
Updated Date - 2021-03-25T06:04:49+05:30 IST