1991 కంటే గడ్డు పరిస్థితులు రాబోతున్నాయ్..
ABN, First Publish Date - 2021-07-24T06:54:29+05:30
దేశ ఆర్థిక వ్యవస్థ 1991లో ఎదుర్కొన్న సంక్షోభం కంటే గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
- దేశంలో ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ 1991లో ఎదుర్కొన్న సంక్షోభం కంటే గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలంటే.. ప్రభుత్వం తన ప్రాధమ్యాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. గడచిన 30ఏళ్లలో వివిధ ప్రభుత్వాల కృషి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగమించిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఆర్థిక సంస్కరణల వల్ల సుమారు 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. యువతకు కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. సంస్కరణల ద్వారా లభించిన వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుని భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా ఎదిగాయన్నారు. కరోనా వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు, జీవనోపాధి కోల్పోవడం బాధాకరం అన్నారు. ఈ నేపథ్యంలో విద్య, వైద్య రంగాల్లో దేశం ఇంకా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
Updated Date - 2021-07-24T06:54:29+05:30 IST