రెండోరోజు పెరిగిన పెట్రో ధరలు
ABN, First Publish Date - 2021-05-05T12:37:32+05:30
వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి....
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. 18 రోజుల తర్వాత మంగళవారం స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ బుధవారం కూడా ఎగబాకాయి. అంతర్జాతీయ ధరలు, విదేశీ మారకపు రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం పెంచారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర 19 పైసలు, డీజిల్ ధర లీటరుకు 21 పైసలు పెంచారు. ఏప్రిల్ 15వతేదీన పెట్రోల్ ధరలు తగ్గించినా, 18 రోజుల తర్వాత వరుసగా రెండు రోజులు ధరలు పెంచారు. ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.90.74 కు డీజిల్ ధర 81.12రూపాయలకు పెరిగింది.
చెన్నై నగరంలో పెట్రోల్ ధర లీటరు రూ.92.70, డీజిల్ ధర 86.09 రూపాయలకు పెరిగింది. ముంబై నగరంలో పెట్రోల్ ధర లీటరు రూ.97.12, డీజిల్ ధర 85.19 రూపాయలకు, కోల్ కతా నగరంలో పెట్రోల్ రూ.90.92, డీజిల్ 83.98 రూపాయలకు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధరలో కేంద్రప్రభుత్వం లీటరును రూ.32.98 కు ఇస్తుండగా,రాష్ట్ర ప్రభుత్వ అమ్మకపుపన్ను, వ్యాట్ 19.55 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు పెరగడం, డీలరు కమీషన్ లతో పెట్రో ధరలు గత రెండు రోజులుగా పెరిగాయి.
Updated Date - 2021-05-05T12:37:32+05:30 IST