ముడి చమురు భగ్గు
ABN, First Publish Date - 2021-03-09T07:03:41+05:30
ముడి చమురు ధరలు మరింత భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం క్రూడాయిల్ రేటు సోమవారం ఒకదశలో 2 శాతం మేర పెరిగి 70.82 డాలర్లు పలికింది. గడిచిన ఏడాదికి పైగా (2020 జనవరి) కాలంలో క్రూడాయిల్కు ఇదే
70 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ జూ ఏడాదికి పైగా గరిష్ఠ స్థాయికి..
సౌదీలోని చమురు పరిశ్రమపై డ్రోన్, క్షిపణి దాడుల ప్రభావం
ముంబై: ముడి చమురు ధరలు మరింత భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం క్రూడాయిల్ రేటు సోమవారం ఒకదశలో 2 శాతం మేర పెరిగి 70.82 డాలర్లు పలికింది. గడిచిన ఏడాదికి పైగా (2020 జనవరి) కాలంలో క్రూడాయిల్కు ఇదే గరిష్ఠ ధర. అలాగే, కరోనా సంక్షోభం మొదలయ్యాక 70 డాలర్లను చేరడం ఇదే మొదటిసారి. ఇక, అమెరికా మార్కెట్కు ప్రామాణికమైన టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ రేటు ఒక దశలో 1.15 శాతం ఎగబాకి 66.83 డాలర్లకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని ముడి చమురు పరిశ్రమ కేంద్రాలపై యెమెన్కు చెందిన హౌతీ దళాలు డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడటంతో ఈ కమోడిటీ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఎందుకంటే, సౌదీ అరేబియా ప్రపంచంలోని అతిపెద్ద క్రూడ్ ఎగమతి దేశాల్లో ఒకటి. కరోనా సంక్షోభ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు కూడా ముడి చమురు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ముడి చమురు ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. భారత మార్కెట్ విషయానికొస్తే, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో బ్యారెల్ ముడి చమురు ఫ్యూచర్స్ కాంట్రాక్టు(మార్చి డెలివరీ) ధర ఒకదశలో రూ.47 పెరిగి రూ.4,891కి ఎగబాకింది.
ఏప్రిల్లో 75 డాలర్లకు..
వచ్చేనెలలో బ్రెంట్ చమురు 75 డాలర్లకు చేరుకోవచ్చని సహజ వనరుల కనల్సింగ్ కంపెనీ వుడ్ మెకెంజీ అంచనా వేసిం ది. అలాగే, 2021లో ప్రపంచవ్యాప్త రోజువారీ క్రూడ్ డిమాండ్ 63 లక్షల బ్యారెళ్ల మేర పెరగవచ్చని అంటోంది. 2022 డిసెంబరు నాటికి క్రూడాయిల్ 100 డాలర్లకు చేరుకోవచ్చని అజెర్బైజాన్కు చెందిన సోకార్ ట్రేడింగ్ ఎస్ఏ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక మూలాలు మళ్లీ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ముడి చమురు మూడెంకల(100 డాలర్ల) స్థాయికి చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా భావిస్తోంది.
మనకు మరింత మంట
భారత మార్కెట్లో ఆల్టైం రికార్డు స్థాయిలకు ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఇప్పటికే మంట పుట్టిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.100 దాటగా.. మిగతా ప్రాంతాల్లో సెంచరీకి అతి చేరువలో ఉంది. గతనెలలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. గడిచిన 8 రోజులుగా యథాతథంగా కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు 70 డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో మంగళవారం మన మార్కెట్లో పెట్రోల్, డీజిల్ మరింత ఎగబాకే అవకాశం ఉంది. సోమవారం నాటికి హైదరాబాద్ మార్కెట్లో లీటరు పెట్రోల్ రూ.94.79, డీజిల్ రూ.88.86గా ఉంది. 2020 నవంబరు నుంచి ఇప్పటివరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.11 మేర పెంచాయి.
Updated Date - 2021-03-09T07:03:41+05:30 IST