ఇంటి(నుండి)కే లగేజీ... ఇండిగో సరికొత్త సేవలు...
ABN, First Publish Date - 2021-04-04T22:42:43+05:30
ఇండిగో ఎయిర్ లైన్స్ తన ప్రయాణికులకు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢి్ల్లీ : ఇండిగో ఎయిర్ లైన్స్ తన ప్రయాణికులకు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ప్రయాణీకుల ఇంటికే బ్యాగేజీని చేర్చే సేవలు ప్రారంభించింది. కొంతమంది ప్రయాణీకులు అధిక లగేజీతో ప్రయాణాలు చేస్తారు. వారికి తమతో పాటు లగేజీ తీసుకు వెళ్లడం కొంతఇబ్బందికరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రయాణానికి ముందు బ్యాగేజీని కౌంటర్లో అప్పగించి మళ్లీ గమ్యస్థానంలో అది చేతికి వచ్చే వరకు వేచి చూడాలి. ఇలా చాలామంది ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటారు. ఇండిగో ఈ క్రమంలో ఓ వెసులుబాటు కల్పించింది.
ప్రయాణీకుల ఈ సమస్య నివారణకు ఇండిగో డోర్ టు డోర్ బ్యాగేజ్ ట్రాన్సుఫర్ సర్వీసును ‘ఇ బ్యాగ్ పోర్ట్’ పేరుతో ప్రారంభించింది. మొదట ఈ సేవలను ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఆవిష్కరించింది. మలిదశలో కార్టర్ పోర్టర్ అనే సంస్థతో కలిసి ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ సేవలనందించనుంది. విమాన ప్రయాణానికి 24 గంటల ముందుగా ఈ సేవలు ప్రయాణికులకు లభిస్తాయి.
కార్టర్ ఎక్స్ వెబ్సైట్ ద్వారా కూడా కస్టమర్లు ఈ సేవలను అందుకోవచ్చు. 6ఈబీఏజీపీఓఆర్టీ ద్వారా ప్రయాణీకులు లగేజీని ట్రాకింగ్ చేయవచ్చు. ప్రయాణీకులు విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు నుండి, విమానం దిగిన తర్వాత ఎప్పుడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇల్లు-విమానాశ్రయం-ఇల్లు లగేజీని పంపించవచ్చు. ఒకసారి ట్రాన్సుఫర్కు రూ. 630 చెల్లించాల్సి ఉంటుంది. ఇక... బ్యాగేజీకి రూ. 5 వేల చొప్పున సర్వీస్ ఇన్సురెన్స్ ఉండనుండడం గమనార్హం.
Updated Date - 2021-04-04T22:42:43+05:30 IST