ఐపీఓ బజార్
ABN, First Publish Date - 2021-08-03T05:53:55+05:30
ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పాలసీబజార్, క్రెడిట్ కంపారిజన్ పోర్టల్ పైసాబజార్ను నిర్వహిస్తున్న పీబీ
పబ్లిక్ ఇష్యూకు పాలసీబజార్
ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పాలసీబజార్, క్రెడిట్ కంపారిజన్ పోర్టల్ పైసాబజార్ను నిర్వహిస్తున్న పీబీ ఫిన్టెక్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.6,017.50 కోట్ల సమీకరించనుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది.
ఇష్యూ ద్వారా రూ.3,750 కోట్ల మొత్తానికి కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుండగా ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్ఫఎస్) ద్వారా రూ.2,267.50 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఓఎ్ఫఎస్ ద్వారా ఎస్వీఎఫ్ పైథాన్ (కేమాన్) రూ.1,875 కోట్ల విలువైన షేర్లు, యశీష్ దహియా రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. కాగా ఐపీఓ కంటే ముందుగానే ప్రైవేట్ ప్లేస్మెంట్ నుంచి కంపెనీ రూ.750 కోట్లు సమీకరించే విషయాన్ని పరిశీలిస్తోంది.
కృష్టా డయాగ్నోస్టిక్స్ ఇష్యూ ధర రూ.933-954
కృష్ణా డయాగ్నోస్టిక్స్ ఇష్యూ ఈ నెల 4 (బుధవారం)న ప్రారంభమై 6న (శుక్రవారం) నాడు కానుంది. ఇష్యూ ధరను కనిష్ఠ స్థాయిలో రూ.933, గరిష్ఠ స్థాయిలో రూ.954 గా ఖరారు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,213 కోట్లు సమీకరించనుంది.
ఈ నెలలో ఐదు ఫార్మా, హెల్త్కేర్ ఇష్యూలు
ఆగస్టు నెలలో ఐదు ఫార్మా, హెల్త్కేర్ కంపెనీల పబ్లిక్ ఇష్యూలు మార్కెట్లోకి రానున్నాయి. ఐపీఓ ద్వారా ఈ కంపెనీలు దాదాపు రూ.8,000 కోట్లు సమీకరించనున్నాయి. ఐపీఓకు రానున్న కంపెనీల జాబితాలో ఎమ్క్యూర్ ఫార్మా రూ.4,000 కోట్లు, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ రూ,1,500 కోట్లు, సుప్రియా లైఫ్సైన్సెస్ రూ.1,200 కోట్లు, విండ్లాస్ బయోటెక్ రూ.400 కోట్లు, కృష్ణా డయాగ్నోస్టిక్స్ రూ.1,200 కోట్ల మొత్తాలను సమీకరించనున్నాయి.
అదానీ విల్మార్ కూడా..
అదానీ విల్మార్ లిమిటెడ్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించేందుకు గాను సోమవారం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఫార్చూన్ బ్రాండ్ కింద కంపెనీ వంటనూనెలను విక్రయిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ఇష్యూ మొత్తానికి కొత్త షేర్లను జారీ చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్లాగ్షిప్ సంస్థ.. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వెల్లడించింది. అదానీ గ్రూప్నకు సంబంధించి ఇప్పటికే అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.
Updated Date - 2021-08-03T05:53:55+05:30 IST