చైనా కంపెనీలకు అమెరికా చెక్
ABN, First Publish Date - 2021-12-04T06:11:49+05:30
అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్..
న్యూయార్క్: అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్.. యూఎస్ పబ్లిక్ కంపెనీస్ అకౌంటింగ్ ఓవర్సైట్ బోర్డు (యూఎ్సపీసీఏవోబీ) పర్యవేక్షణ, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. లేకపోతే ఆ కంపెనీల షేర్లు అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడయ్యేందుకు అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొంది. దీనికి తోడు ఆ కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో ఆ కంపెనీలు ప్రభుత్వ కంపెనీనా? లేక ప్రభుత్వానికి ఏమైనా కంట్రోలింగ్ వాటా ఉందా? అనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని కోరింది. అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (ఎస్ఈసీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమెరికా నుంచి చైనా కంపెనీలు నిధులు సేకరించడం ఇక అయ్యే పని కాదని భావిస్తున్నారు.
అమెరికాకు ‘దీది’ గుడ్బై: ఈ వార్తల నేపథ్యంలో చైనా రైడ్ హెయిలింగ్ సర్వీస్ కంపెనీ ‘దీదీ గ్లోబల్ ఇంక్’ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలు చేస్తామని తెలిపింది. త్వరలోనే తమ షేర్లను హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ చేయబోతున్నట్టు తెలిపింది.
కష్టాల్లో మరో రియల్టీ కంపెనీ: చైనా రియల్టీ మార్కెట్లో కష్టాలు కొనసాగుతున్నాయి. హాంకాంగ్ కేంద్రంగా పని చేసే కైసా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే మరో కంపెనీ ఆర్థిక కష్టాల్లో పడింది. మరో వారం రోజుల్లో కాలం తీరే రుణ పత్రాలపై చెల్లించాల్సిన 40 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,000 కోట్లు) చెల్లించలేక పోవచ్చని ప్రకటించింది.
Updated Date - 2021-12-04T06:11:49+05:30 IST